Friday, 30 December 2016

పుణ్యప్రదం ~ పుష్యమాసం 30.12.2016 నుండి ప్రారంభం

నిన్న అనగా 30.12.2016 నుండి పుష్యమాసం ప్రారంభం కాబడినది ఈ మాసం
పుణ్యప్రదం ~ పుష్యమాసం

          పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన గణన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. చాంద్రమాన, సౌరమాన గణనల రెండింటి ప్రకారం ఏర్పడే పండుగలు వస్తాయి ఈ మాసంలో. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం.

          పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. ఇతడు బుద్ధి కారకుడు. అందువలన బృహస్పతికీ శనికీ అత్యంత ప్రీతికరమైనదీ మాసమని చెబుతారు. శనిపేరు వినగానే ఉలిక్కిపడతారు చాలామంది. అతడు హాని కారకుడనే నమ్మకమే దీనికి కారణం.

             శని సత్యధర్మాలను సమానంగా పాటించేవాడు. ఆరాధించేవారిని అనుగ్రహించే తత్వంకలవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చేనూనె. కాబట్టి ఈ మాసంలో వాటితో ఆయనను అభిషేకించి, పూజించాలని, దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్ర వచనం.

           బాహ్య భావనలు ఇవైనా, అంతరార్థం లోతైనది. హేమంత (హిమం=మంచు) రుతువులో ఇది రెండో మాసం. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. అందువల్లే 'పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు' అనే నానుడి ఏర్పడింది. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైల గ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ తైల (తైలం=తిలల (నువ్వుల) నుంచి తీసినది) అభ్యంగనం. శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేది ఉష్ణోగ్రత. ఇది శరీరంలోని ధాతువుల్లో ఉండే కొవ్వు పదార్థాలపై ఆధారపడి ఉంది.

         ఈ మాసంలో అవి మందగించడంవల్ల తైలశాతం తగ్గుతుంది. దాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం నువ్వులు, బెల్లం కలిపి తినడం. బెల్లం ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్య ప్రదమైన పదార్థం. దీనివల్ల రక్తవృద్ధి జరుగుతుంది. ధాతు పుష్టి కలిగి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందువల్లనే ఈ నెలలో వచ్చే పండుగలన్నింటిలోనూ తైలాభ్యంగనం తప్పనిసరి అంటారు.

ఈ మాసంలో వ్రతాలు

        ఈ మాసంలో శుక్లపక్ష విదియనాడు ఆరోగ్య వ్రతం చేస్తారు. దీనికి 'ఆరోగ్య విదియ' పేరు. శుక్లపక్ష షష్ఠి కుమారషష్ఠి. కుమారస్వామిని ఇలవేలుపుగా కొలిచే ప్రాంతాల వారు ఆయనను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శుక్ల అష్టమినాడు సంజ్ఞిక అనే శ్రాద్ధం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శుక్లదశమి శాంబరీ (రతీదేవి) దశమి. శివపార్వతులను కలిపే ప్రయత్నంలో శివుని ఆగ్రహానికి గురై భస్మమయ్యాడు మన్మథుడు. అప్పుడు రతీదేవి తన కోసం కాకపోయినా, సృష్టి గమనం సక్రమంగా సాగడం కోసమైనా అతడిని బతికించమని కోరింది. సఫలత సాధించింది. లోకోపకారం కోసం ఎంతగానో మథనపడి భర్తను బతికించుకున్నందుకు కృతజ్ఞతగా ఈ వ్రతంచేసి రతీదేవిని పూజిస్తారు. ఒడిషాలో ఈ ఆచారం ఎక్కువ. శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే పుత్రదా ఏకాదశి దీనికి నందైకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువాలాయాలలో వైకుంఠ ద్వారము ఏర్పాటు చేసి అత్యంత పవిత్రంగా విష్ణుని దర్షించు కుంటారు మరియు ఈ రోజు సంతానం లేనివారు ఈ రోజు లక్ష్మీనారాయణుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

           పుష్యమాసం అనగానే గుర్తుకు వచ్చేది ధాన్యలక్ష్మి. ధనుర్మాసం పంట ఇంటికి చేరి ధాన్యరూపంలో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. కాబట్టి పౌష్యలక్ష్మిగా పిలుస్తారు. రంగవల్లులు, ధనుర్మాస వ్రతాలు, గొబ్బెమ్మల అలంకారాలు వీటన్నింటి సందడీ అంతా ఇంతా కాదు. తెలుగువారు పాటించేది చాంద్రమానమైనా, సౌరమాన గణన ప్రకారం జరిపించుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇది మూడు రోజుల పండుగ. సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశించే రోజు ఇది. తమ వంశంలో గతించిన పితృదేవతలనందరినీ స్మరిస్తూ పూజిస్తారు ..

          ఈ మాసం లో పంటలు పండి ధాన్యం  ఇండ్లకు చేరడము  వల్ల  రైతుల శ్రమ, కష్టం ఫలించి  ఫలం లభించే  మాసం.  చాన్ద్రమాసం  ప్రకారం పదవదైన ఈ మాసంను శూన్య మాసం అంటారు. ఐతే  సూర్య భగవానుడు ధనుస్సురాశిలో  సంచరిస్తూ ఉన్న కాలం మాత్రమె - "శూన్యమాసము "  మకర సంక్రమణ  జరిగిన తరువాత శూన్యమాసము  కాదు. ఈ మాసములో పగలు తక్కువ రాత్రి అధికము.

           పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కనుక ఈ నెలలో  శనిదేవుడి  ప్రభావము అధికంగా  వుంటుంది.  శనిదేవుడికి ప్రతీకమైన మాసము కనుక ఈ నెల  అంతా  శనిదేవుడిని పూజించవలెను.  ఈ మాసములోని  ఆదివారాల్లో ప్రత్యక్ష భగవానుడైన  శ్రీ సూర్యభగవానుడిని   పూజించాలని శాస్త్ర వచనము ముఖ్యంగా ఆదివారంనాడు సూర్యుడిని ఆవుపాలతో అభిషేకించి,  జిల్లేడు పూలతొ పూజించవలెను.  ఈ నెలలో వచ్చే సప్తమిని మార్తాండ సప్తమి అంటారు.  ఆ రోజు సూర్యుడిని  పూజ  చేయడము  వల్ల  మంచి ఫలితము వస్తుంది.

             పుష్య అమావాస్య నాడు  ఇంటిలోని ఒక చోట   శుభ్రపరచి  బియ్యపిండితో  అష్టదళ  పద్మములు వేసి  దానిపైన  కుంపటి పెట్టి  దాంట్లో ఆవు పిడకలు వేసి వెలిగించి దానిమీద కాంస్య పాత్రలో పాయసము చేసి ఉంచవలెను.  ప్రక్కనే  శివలింగం  వుంచవలెను.కంచుపాత్ర యందు బ్రహ్మ దేవుడిని, పాయసము నందు  శ్రీ మహా విష్ణువును , శివలింగం నందు శివుడిని ఆవాహన చేసి పూజించవలెను.బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను.  తరువాత  శివలింగాన్ని, ఆ పాత్రను  బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను.  ఈ విధంగా చేయడము వల్ల   భూదాన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలితము  లభిస్తాయి.

        ఈ  విధంగా ఎన్నో విశిష్టతలను కలిగిన ఈ పుష్యమాసములో చేసే  పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది

             పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం (ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రమంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు.

         పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత . శనికి అధి దేవత యముడు. "యమం " అంటే "సం యమం" అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శక్తి  లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది.

        శని ధర్మదర్శి. న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను,పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శనికి పైన చెప్పిన గుణాలు అన్నీ పొందవచ్చు. ఎప్పుడూ మనిషి వీటిని పొందుతాడో ,అప్పుడతడు బృహస్పతి వంటి వాడు అవుతాడు. అందువల్ల,పుష్యమి నక్షత్రానికి బృహస్పతిని అధి దేవతగా చెప్తారు.అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని నిరూపితమైంది. పరమాత్ముని నాభి కమలం నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడు. ఎప్పుడు  శరీరంలోని ఈ నాభి ప్రదేశాన్ని శని ప్రదేశమని చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఇవ్వబడిన  ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని చెప్పినట్లు మనం గ్రహించాలి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment