కుంకుమ పువ్వు గురించి పూర్తి వివరణ*
కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇది శీతల ప్రదేశంలో పండుతుంది. కుంకుమ పువ్వులో ఉపయోగ పడే భాగం ఎర్ర కేశరాలు మాత్రమే. ఒక కిలో కేశరాలు కావాలంటే కనీసం రెండు లక్షల పువ్వులు అవసరం అవుతాయి. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము.
ఈ కేశరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా ఉంటాయి.ఈ భూభాగంలో అత్యంత ఖరీదైనది, అద్భుత ఔషథ గుణాలు కలదీ ఈ కుంకుమ పువ్వు మాత్రమే. నాటి రాచరిక దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. క్రీ.పూ. 500 ఏళ్లకు ముందే దీని ప్రస్తావన ఉంది. మన వేద కాలం సంస్కృతిలోనూ సౌందర్య పోషణకు విరివిగా వాడకం ఉంది.
మనదేశంలో ఈ కుంకుమ పువ్వును కాశ్మీర్లో విరివిగా పండిస్తారు. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు కోతకు వస్తుంది. కుంకుమ పువ్వు మొక్క చూడడానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుండి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు పూస్తాయి.
కాశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబర్- నవంబర్లలో విరబూసిన కుంకుమ పువ్వులతో నిండిపోతుంది. ముందుగా మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమ పువ్వు అనుకుంటే పొరబాటు. అందులోముచ్చటగా మూడు అండకోశాలు, రెండు ఎర్రరంగులో కేశరాలు ఉంటాయి.
కిందభాగంలో పసుపు, పైన ఎరుపు రంగులో ఉండే ఈ అంకోశాలనే కుంకుమ పువ్వు అని పిలుస్తారు. ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను వేరుచేసి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి సువాసనతో ఉంటాయి.
ఒక్కరోజు పూలు కొయ్యడంలో ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే ఉదయమే పువ్వులను కోసేస్తారు. అన్ని పూలనుంచీ చేతులతోనే అండకోశాలను వేరుచేయాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. మన కాశ్మీర్లో గ్రాము కుంకుమ పువ్వు ధర రూ.60నుండి రూ.600 వరకూ వుంటుంది. నాణ్యతను బట్టి ధర మారుతుంది. అయితే మనిషి వాడిన మొట్టమొదటి సుగంధ ద్రవ్యం ఇదేనంటారు.
కుంకుమ పువ్వును రంగు పదార్ధంగానూ, సువాసన కోసం తినుబండారాల్లోనూ, తాంబూలంలోనూ వాడతారు.
నేత్రవ్యాధులలోనూ, ముక్కు సంబంధ వ్యాధులలోనూ మందుగా కుంకుమ పువ్వును వాడతారు. కుంకుమ పువ్వును గంధంలా తయారు చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా, ఆకర్షణీయంగా తయారౌతుంది. అదనపు రంగు, సువాసన కోసం దీన్ని అన్ని వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వు కంటికి చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యం మీదపడుతున్న కొద్దీ చాలామందికి కంటి చూపు మందగిస్తుంది. అందుకే తరచూ ఆహారంలో కుంకుమ పువ్వును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.
రక్తప్రసరణను మెరుగుపరచి రక్తపోటును తగ్గిస్తుంది. మెనోపాజ్ సమస్యలకు కూడా కుంకుమ పువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు.
దీనిలో క్యాన్సర్ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశోధనల్లో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాల ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో ఉంది కాబట్టి కుంకుమ పువ్వును ఎక్కువ వాడవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. గర్భవతులే కాదు, ఎవరైనా కుంకుమపువ్వును తీసుకోవచ్చు. అయితే కొన్ని నకిలీ పువ్వులు కూడా మార్కెట్లో కనిపిస్తాయి. దానిమ్మ పూరేకులను, బీట్రూట్ తురిమిన తురుమును కుంకుమ పువ్వు శాప్రాన్గా అమ్ముతారు. కొనేది మంచిదా కాదా అనేది తెలుసకొనేందుకు కొన్ని రేకులను నీటిలో వేస్తే వెంటనే రంగు వస్తే అది నకిలీదని తెలుసుకోండి.
కుంకుమ పువ్వు నీటిలో రంగు రావడానికి నానిన 15 నిమిషాల తర్వాత గానీ రంగురాదు. కాబట్టి కుంకుమ పువ్వును కొనేప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్