ఆది శంకరాచార్యులు జన్మదినం 30.04.2017 దీనినే శంకర జయంతి గా జరుపుకుంటారు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం !!
శంకరశ్శంకరస్సాక్షాత్
"యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అను గీతా శ్లోకానుసారంగా, ధర్మానికి గ్లాని (లోటు) సంభవించినప్పుడు, 'నేను' అవతరిస్తాను అంటూ, సాక్షాత్ పరమాత్ముడు హామీ ఇచ్చారు. అదే ప్రకారంగా... వివిధ రకాలైన మతాచారాల ప్రవేశంతో... సనాతన ధర్మం క్షీణ దశకు చేరిన సమయంలో సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యులుగా అవతరించినట్లు గా పెద్దలు,గురువులు చెప్పారు.
కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామ అగ్రహారంలో వైశాఖ శుక్ల పంచమినాడు శివగురు, ఆర్యాంబ అను పుణ్య దంపతులకు శంకరులు జన్మించారు.
అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాః -
అని మాధవులు అన్నట్లుగా శంకరులు బాల్యంలోనే సకల వేద వేదాంగాలను, వివిధ శాస్త్రాలను ఔపోసన పట్టారు. గురుకులవాస సమయంలోనే ఒక పేదరాలి దీనావస్థను చూసి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని స్తుతించి, ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపింపచేశారు.
ఆ స్తోత్రమే 'కనకధారాస్తవము'గా ప్రసిద్ధి నొందినది. అలానే శంకరుల బాల్యం అంతా ఆయన ప్రజ్ఞాపాటవములు ఏదో రూపేణా లోకానికి తెలిసేవి. ఒక నాడు అనారోగ్య కారణం చేత, తమ ఇంటికి దూరంగా వున్న పూర్ణానదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేందుకు శంకరుని తల్లి ఆర్యాంబకు కష్టతరమవ్వగా తల్లి కష్టాన్ని చూసి చలించిన శంకరులు తన తపోశక్తిచే పూర్ణానదినే తమ ఇంటి వద్దకు వచ్చి ప్రవహించేలా చేసి ఆ తల్లిని ఆనందింపజేసినారు.
శ్రీ కనకధారా స్తోత్రం
వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం
కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః
బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం
శివగురు నిర్యాణానంతరం ఒక్కగానొక్క కొడుకైన శంకరులు సన్యాసం స్వీకరించడం శంకరుని తల్లి ఆర్యాంబకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అంచేత మకరం (మొసలి) తనను పట్టుకుందని చెప్పి లీల చేసి, తల్లి అనుమతితో ఆపద సన్యాసం స్వీకరించారు బాల శంకరులు.
తరువాత నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల నుండీ సన్యాసదీక్షను తీసుకుని అద్వైత మత హృదయాన్ని ఆకళింపు చేసుకున్నారు. తదుపరి వీరి వద్ద వుంటూ సనాతన ధర్మానికి చెందిన జ్ఞానసంపదకు వాటిల్లుతున్న గ్లాని గురించి యోచించి, వాటి సంరక్షణార్థం సంకల్పంగావిస్తారు. పిదప కాశీ వెళ్ళగా. అక్కడ శంకరుల శిష్యగణం బాగా వృద్ధి చెందసాగింది.
ఒకానొకనాడు శంకరులు నడుస్తున్న మార్గంలో ఒక ఛండాలుడు ఎదురుపడగా ప్రక్కకు తప్పుకో నా మార్గానికి అడ్డు తొలుగమని హెచ్చరించగా శరీరాన్ని ప్రక్కకు తప్పుకోమనాలా? ఆత్మను ప్రక్కకు తప్పుకోమనాలా? సర్వవ్యాపకమైన, ఒక్కటిగా వున్న ఆత్మ ప్రక్కకు తప్పుకోవడం సాధ్యమౌతుందా? అని ప్రశ్నించిన ఛండాలడు పాదం మోపిన నేలను స్పృశిస్తూ నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి, నాకు నా స్వరూప జ్ఞానాన్ని అందించిన వారు ఎవరైనా సరే "ఛండాలోస్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ" వారు చండాలురైనా, సదాచార సంపన్న బ్రాహ్మణులైనా వారు నాకు గురుస్వరూపమే. అంటూ ఆశువుగా స్తుతిస్తారు. అదే మనీషా పంచకంగా లోక ప్రసిద్ధి నొందినది.
తరువాత కాశీనగరంలో మరణావస్థకు దగ్గర పడుతున్న వృద్ధుడు లోకసంబంధిత వ్యాకరణ సూత్రాలను వల్లె వేయడం చూసిన శంకరులు ఆతని నెపంతో, జగతికి కర్తవ్యబోధ చేయునిమిత్తం ఆ వృద్ధుని చర్యను చూచి అతనిని "మూఢమతి" అని సంభోదిస్తూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ఆశువుగా కొన్ని శ్లోకాలను చెప్పగా అక్కడున్న వారి శిష్యులు తలొక్కరు ఒక్కొక్కటి చెప్పి వాటిని అన్నింటిని కలిపి "మోహముద్గర" స్తోత్రంగా మలుస్తారు. అదే 'భజగోవింద స్తోత్రం'గా రచయింపగా, ఈ స్తోత్రం తేలిక పదాలతో వుండడం వల్ల ఎల్లరూ గానం చేసేందుకు సైతం అనుకూలంగా వుండడం చేత ఇది జగత్ ప్రసిద్ధినొందినది.
తరువాత వ్యాసభగవానుని దర్శనానుభూతిని పొందిన ఆదిశంకరులు, ఆ బాదరాయణుని ప్రేరణతోనే వ్యాస హృదయాన్ని వ్యక్తం చేసే తీరులో బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసినట్లుగా పెద్దలు చెబుతుంటారు. ఇలా ప్రస్థానత్రయమైన దశ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు శంకరులు విరచించిన భాష్యం నేటికీ అందుబాటులో వున్నది.
శంకరుల శిష్యగణంలో తోటకాచార్యులు, పద్మపాదులు సుప్రసిద్ధులు.
తోటకాష్టకం
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 2 ||
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || 4 ||
సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||
జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||
కాశీ నగరంలో శంకరుల జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగినది. ఇందులో భాగంగా కుమారిల భట్టును, మండవ మిశ్రుని ఓడించుట సైతం జరిగినది. సనాతన ధర్మంలో వివిధ సాంప్రదాయలకు మధ్యన ఉన్న అంతరాలను తొలగించుటకు శంకరులు ఎంతగానో కృషిసల్పారు. ప్రస్థానత్రయ భాష్యకారునిగా, షణ్మత స్థాపకుడిగా, ఆచార్యులుగా, జగద్గురువులుగా కీర్తి గడించిన శంకర భగవత్పాదులు సాక్షాత్ పరమశివుడేనని పెద్దలు చెబుతారు.
కాశ్మీర దేశంలో సర్వజ్ఞ పీఠాన్ని అథిరోహించి, దేశం నలుమూలల అద్వైత పీఠాలను స్థాపించి, జగతికి అద్వైత జ్ఞానబోధ చేయమని శిష్యులకు అప్పజెప్పి, శంకరులు కేదార్ నాథ్ క్షేత్రం నుండీ హిమాలయాలలోకి వెళ్ళి అంతర్ధానమయ్యారు.
ఓం హరలీలావతారాయ శంకారాయ పరౌజిసే
కైవల్య కలనా కల్ప తరవే గురవే నమః
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).
హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.
బాల్యము
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
గోవింద భగవత్పాదుల దర్శనం
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి.
ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరినాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది.
బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవించాడు.శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
పద్మపాదుడు( పద్మపాదాచార్యులు)
శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు.
ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.
అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని
అభినందించారు.
కుమారిల భట్టు ను కలవడం
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు.
భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు.
అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.