Friday, 7 April 2017

ఈ రోజు అనగా(08.04.2017, శనివారము చైత్ర శుద్ధ త్రయోదశి దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి వ్రతం”

ఈ రోజు అనగా(08.04.2017, శనివారము చైత్ర శుక్ల త్రయోదశి

దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే
“అనంగ త్రయోదశి వ్రతం”

            ఆలుమగల అన్యోన్యతను పెంచే ఆరాధన ఏ ఇంట్లోనైనా అడుగుపెడితే అక్కడి వాతావరణం ప్రశాంతంగా అనిపించినా పవిత్రంగా కనిపించినా ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందనే విషయం అర్థమైపోతుంటుంది. ఏ కుటుంబానికైనా భార్యాభర్తలు రెండు కళ్లవంటివాళ్లు. ఇద్దరిమధ్యా అనురాగం అవగాహన ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కొనసాగుతూ వుంటుంది.

        ఇలాకాక ఎవరి తీరు వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తే, ఇద్దరూ కలిసి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచేదిగా 'అనంగ త్రయోదశి' కనిపిస్తుంది. చైత్రశుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా పిలవబడుతోంది. ఈ రోజున మన్మథుడిని స్మరించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

              భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే “అనంగ త్రయోదశి”. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు.
              ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం. శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.

            భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగ త్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

             అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి

నమోస్తు పుష్పబాణాయ
జగదాహ్లాదకారిణే!! 
మన్మధాయ జగన్నేత్రే !
రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి

కామదేవాయ విద్మహే| 
పుష్పబాణాయ ధీమహి|
తన్నో అనంగ ప్రచోదయాత్‌||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ

          మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది.

           అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.

              ఈ నేపథ్యంలో మన్మథుడిని స్మరించుకునే రోజుగా మనస్ఫూర్తిగా ఆరాధించే రోజుగా అనంగత్రయోదశి చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనని స్మరించుకోవడం వలన ఆలుమగల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందనీ, వైవాహిక జీవితం సంతోషకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.

మన్మథునికి శివునికి గల సంబంధం 

             మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.

           మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ,ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.

           ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు.

            పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. శివపార్వతుల కల్యాణం లోకకళ్యాణ కారకమైనప్పుడు, దేవతలు తలపెట్టిన ఆ ప్రయత్నంలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు మన్మథుడు.

              సతీదేవి వియోగంతో తపస్సులోకి వెళ్లిన పరమశివుడిని అందులో నుంచి బయటికి తీసుకువచ్చి, ఆయన పార్వతీదేవి పట్ల అనురక్తుడయ్యేటట్లుగా చేసినది మన్మథుడు. అలాంటి మన్మథుడి కారణంగానే లోకంలో ఆలుమగల మధ్య అనురక్తి కలుగుతోంది.మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

            మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలం దరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది.

           ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.

         మన్మధుడు భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు.

           రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు.

          ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.

         రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతా అనురాగాలున్న దంపతులు, అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది

త్రయోదశి గురించి కొన్ని విశేషాలు, 

        పదమూడు సంఖ్య మంచిది కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ భారతీయ సంప్రదాయంలో పద మూడవ తిథి మంచిరోజు.
తిథులలో పదమూడవ తిథి త్రయోదశి. ప్రతి నెలలోనూ రెండుసార్లు అంటే కృష్ణపక్షంలో ఒకసారి, శుక్లపక్షంలో ఒకసారి వస్తుంది. ఆ విధంగా  సంవత్సరానికి ఇరవై నాలుగుసార్లు వస్తుందన్నమాట.

     ఈ తిథికి అధిపతి మన్మథుడు. ప్రతి తిథిలోనూ మనం ఏదో ఒక పండుగను ఆచరిస్తాం. కానీ ఈ తిథిలో ఏ పండుగలూ లేవు. అందుకే ఇది శనీశ్వరుని సొంతమైనది. ఈయన ప్రభావం ఈ తిథిపై ఉంటుంది. కాబట్టే దీనిని శని త్రయోదశి అని అంటారు. ఈ తిథిలో  ప్రయాణం శుభ ఫలితాలనిస్తుంది. తిథి ఫలం శుభం కాబట్టి ఈ తిథి రోజున వంకాయ తినకూడదు.

త్రయోదశి గాయత్రి మంత్రం

ఓం మనోజాతాయై విద్మహే అనంగాయై:|  
ధీమహి తన్నో: త్రయోదశి ప్రచోదయాత్‌||

          ప్రతి త్రయోదశికి ఆచరించవలసిన విషయాలను పరిశీలిద్దాం.
ఛైత్ర శుద్ధ త్రయోదశి- దీనికే అనంగ త్రయోదశి అనీ, మన్మథ త్రయోదశి, మదన త్రయోదశి అనీ పేరు. మన్మథుడు అతి సౌందర్యవంతుడు. మన్మథుడి వాహనం చిలుక. పుష్పాలే అయన బాణాలు. ప్రేమకు అధిదేవత.

శరీర దాత, శాప ప్రదాత ఒక్కరే :
             మన్మథుడు బ్రహ్మదేవుని హృదయంలో నుంచి జన్మించాడు. ఆయన భార్య రతీదేవి బ్రహ్మదేవుని ఎడమ భాగం నుంచి జన్మించింది. ఆయనకు జన్మను ప్రసాదించిన బ్రహ్మదేవుడే ఆయనకు శాపమిచ్చాడు. ఆ శాప ప్రభావంవల్లనే ఆయన  తన శరీరాన్ని కోల్పోయాడు.

               రతీ మన్మథులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు. వారిని పూజిస్తే దాంపత్య సుఖం ప్రాప్తిస్తుంది. ఈ త్రయోదశికే 'కామదేవ త్రయోదశి' అని మరో పేరుకూడా ఉంది, ఆ రోజున దవనంతో శివుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందని స్మ ృతి కౌస్తుభంలో చెప్పబడింది.

వరాహ జయంతిపై తర్జనభర్జనలు :

            ఛైత్రబహుళ త్రయోదశి-  ఈ రోజున వరాహజయంతి. దశావతారాలలో మూడవది ఈ అవతారం. ఈ విష యంమీద పండితులలో చిన్న భేదాభిప్రాయం ఉంది.  ఛైత్ర బహుళ నవమి అని కొంతమంది అంటుంటారు. కానీ పంచాంగకర్తలు మాత్రం ఛైత్ర బహుళ త్రయోదశినే 'వరాహ జయంతి'గా పేన్కొంటాయి.

వైశాఖ శుద్ధ, బహుళ త్రయోదశిలకు ప్రత్యేకతలేమీ లేవు.

జ్యేష్ట శుద్ధ త్రయోదశి- రంభా త్రిరాత్ర వ్రతం. ఆరోజున అరటి చెట్టుకింద ఉమామహేశ్వరుల పూజచేస్తారు. కానీ ఇది అంతగా ఆచరణలో లేదు.

సున్ని ఉండలు నైవేద్యం : 

శ్రావణ శుద్ధ త్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం. రతీమన్మథులకు ఎర్రరంగా పుష్పాలు, కుంకుమ కలిపిన  అక్షతలను ఉపయోగించాలి. మినుములు, బెల్లం, నేయి కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. పాలనుకూడా పెడతారు. మైనపువత్తితో హారతి ఇప్తారని పెద్దల చెబుతారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి- ధన త్రయోదశి, ఇది దీపావళి పండుగకి రెండు రోజుల ముందు వస్తుంది. ఆరోజు నుంచీ దీపాలు పెడతారు. లక్ష్మీపూజ చేస్తారు.

కార్తీక బహుళ త్రయోదశి- దీపదానం శ్రేష్టం.
మార్గశిర శుద్ధత్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం మంచిది.

యమ దర్శన త్రయోదశి :
మార్గశిర కృష్ణ త్రయోదశి- దీనిని యమదర్శన త్రయోదశి అంటారని చాతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది.

మాఘ శుక్ల త్రయోదశి- విశ్వకర్మజయంతి. విశ్వకర్మ దేవశిల్పి. గొప్ప వాస్తు శాస్త్రజ్ఞుడు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

1 comment: