Wednesday, 22 February 2017

చరిత్రకు సాక్ష్యం జోగుళాంబ శక్తిపీఠం

* చరిత్రకు సాక్ష్యం జోగుళాంబ శక్తిపీఠం

               అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు, సంప్రదాయాలకు భిన్నంగా, ఆరు మతాలకు నిలయంగా, నవ లింగ దివ్య ధామంగా అలంపూర్ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడున్న నవబ్రహ్మేశ్వర ఆలయాలలో బాలబ్రహ్మేశ్వరాలయం ప్రధానమైంది. ‘‘బాలబ్రహ్మేశ్వరాయస్తు భక్తకల్ప ద్రుమాయచ, కోటిలింగ స్వరూపా స్వర్ణలింగాయ మంగళం’’ అనే శ్లోకం వివరించినట్లుగా ఈ క్షేత్రం మొత్తం కోటి లింగాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.

             కంచి కామాక్షి, నృసింహ, సంగమేశ్వర తదితర ఆలయాలు సౌరు, శాక్తేయ, గణాపత్య, శైవ, వైష్ణవ, స్కంధ మతాల ప్రత్యేకతలు వివరిస్తున్నాయి. ఎర్రని ఇసుక రాతితో నిర్మాణమై ఆలయ శిఖరాలు విమాన నాగరిక శైలిని పోలి ఉన్నాయి. పురాణకాల చరిత్రకు అద్దం పట్టేలా ఆలయ కుఢ్యాలపై పంచతంత్ర కావ్య కథా శిల్పా లు, ఆదిత్య హృదయం, రామాయణం, భారతం, భాగవతం తదితర ఇతిహాస, పురాణ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు, శిల్పాలు చెక్కబడ్డాయి.

             త్రిమూర్తులు, గంగావతరణం (భగీరథ ప్రయత్నం) చండీశ్వరి లకులీశమూర్తి, సైకత గణపతి, దుర్గ, ఇంద్రాది అష్టదిక్పాలకులు, సప్తమాతృకల విగ్రహాలు, కాలభైరవ, వీరభద్రుడు, దక్షుడు, పార్వతి, నటరాజు, అరుదుగా కనిపించే అర్ధనారీశ్వర, సంహార నృసింహ విగ్రహాలు అధిక సంఖ్య లో ఉన్నాయి. ఉత్సవాలలో ఉపయోగించే దశకంఠుడు, సూర్యప్రభ పంచలోహ విగ్రహాలు చూడగానే ఆకట్టుకుంటాయి. ఈ కళా ఖండాలు తరతరాల చరిత్రను నేటి తరాలకు చాటిచెబుతున్నాయి.

* ప్రసిద్ధి చెందిన శిల్పాలెన్నో..

ఈ జోగులాంబ క్షేత్రంలో జీర్ణమైన ఓ ఆలయంలో పురాతత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు, మనోహర శిల్పాలు, వాస్తురీతులు వివరించే స్తంభాలను భద్రపరిచారు. 7వ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకు దక్షిణాపథాన్ని పాలించిన వివిధ రాజవంశీయుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. వివిధ వైదిక మత శాఖలకు వాటి అంతశ్శాఖలకు సంబంధించిన దేవతామూర్తులున్నాయి.

           సిద్దులు, తాంత్రిక ఉపాసకుల ప్రతీకలు ఉన్నాయి. సుందర, సుమనోహర విగ్రహాలతోపాటు నాగప్రతిమలున్నాయి. మహిషాసురమర్ధని విగ్రహంలో అమ్మవారి ముఖం లో ఓ చెంప రౌద్రం, మరో చెంప చిరుమందహాసం వ్యక్తం చేసేలా చెక్కిన తీరు అద్భుతం. ఇక్కడ లభ్యమైన నందీశ్వరుడిపై పార్వతీ పరమేశ్వరులు గల ఏకశిలా విగ్రహం దేశంలో మరెక్కడా కనిపించదు.

            ప్రసన్న వదనంతో కనిపించే సూర్యభగవానుడి విగ్రహాన్ని, నాగబంధాన్ని చూస్తుంటే చూపు పక్కకు మళ్లదంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా 1984లో జర్మనీలో ఏర్పాటు చేసిన ప్రపంచస్థాయి పురావస్తు ప్రదర్శనలో క్రీస్తుశకం 5-7 శతాబ్దానికి చెందిన ఇక్కడి సూర్యభగవానుడి విగ్రహం, 1977లో లండన్‌లో నిర్వహించిన పురావస్తు ప్రదర్శనలో క్రీ.శ 11-12 శతాబ్దానికి చెందిన నటరాజ విగ్రహం, 2008లో బెల్జియంలో జరిగిన ప్రదర్శనలో నాగబంధం విగ్రహాలు మొదటి స్థానంలో నిలిచి శిల్పాచార్యులను అజరామరులను చేశాయి. కల్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యులు వేయించిన 26 భూదాన శాసనాలు లభ్యంకాగా మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

* పాపాలను కడిగే పాపనాశేశ్వర తీర్థం

             అలంపూర్ పట్టణానికి దక్షిణాన అర మైలు దూరంలో 24 ఆలయాలతో పాటు పవిత్ర పాప నాశేశ్వర తీర్థం ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ఈ తీర్థాన్ని మళ్లీ అలంపూర్ వద్ద నిర్మించారు. అష్టాదశ తీర్థాలలో కొన్ని తీర్థాలు శిథిలావస్థలో ఉండగా ప్రస్తుతం దేవద్రోణి తీర్థం మాత్రమే నేడు కనిపిస్తుంది. పాపనాశేశ్వర ఆలయం చుట్టూ చిన్న చిన్న గూడులు, మంటపాలు నిర్మించారు. ఇవి ద్రావిడ, వేసర శిల్ప సంప్రదాయానికి చెందిన ఆలయాలు. స్తంభాలయాలపై రామాయణ గాథలు, క్షీరసాగర మధనానికి చెందిన శిల్పాలు ఇప్పటికి రమణీయత ఉట్టిపడేలా ఉన్నాయి.

* శతాబ్దాల చరిత్రకు ఆధారాలు

           క్రీస్తు శకం 566-757 వరకు బాదామీ చాళుక్యుల వాస్తు పద్ధతిలో అలంపూర్‌లోని నవబ్రహ్మేశ్వర ఆలయాలను నిర్మించినట్లు ప్రముఖ పరిశోధకుడు, కవి పండితుడు కీర్తిశేషులు అలంపూర్ గడియారం రామకృష్ణ శర్మ దక్షిణకాశీ.. అలంపురం చరిత్ర అనే గ్రంథంలో పేర్కొన్నారు. శాతనకోటి నుంచి తెప్పించిన ఎర్రటి ఇసుకరాయిని ఈ నిర్మాణాలకు ఉపయోగించారని వివరించారు.

           బాదామీ చాళుక్యులలో పరమేశ్వర బిరుదాంకితుడైన రెండో పులకేశి రాజు కాలంలో దాదాపు 1400ల సంవత్సరాల కిందట ఆరో శతాబ్దంలో ఈ ఆలయ సముదాయాల నిర్మాణం మొదలైనట్లు ఇక్కడ లభించిన వివిధ శాసనాల ద్వారా వెల్లడైనట్లు పేర్కొన్నారు. నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైన బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని క్రీ.శ.702లో చాళుక్య విజయాధిత్యుడు నిర్మించాడు.

                లింగం తల భాగం దోసిలి(గోష్పాదం) ఆకారంలో గుంతలు పడి ఉంది. అవి సిద్ధులు రసం తోడిన గుర్తులు కావచ్చని, లింగం ఔషధ, మంత్ర, తంత్ర సంస్కారాలు పొంది భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. ప్రాకారాన్ని కట్టిన శిల్పి ఈశానాచార్యుడు రాజ సత్కారం పొందాడు. మిగిలిన 8 ఆలయాలు.. వరుసగా కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మబ్రహ్మేశ్వరాలయాలు. బ్రహ్మేశ్వర ఆలయ సముదాయానికి సమీపంలోని కృష్ణా, తుంగభద్ర సంగమ క్షేత్రంలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురవుతుందని ఇక్కడ పునర్నిర్మించారు.

             విజయాధిత్యుడు వేయించిన శాసనం నేటికీ బ్రహ్మేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాధిత్యుడి కాలానికి చెందిన లేఖనం కనిపిస్తుంది. ఆర్క బ్రహ్మాలయంలో మంటప స్తంభంపై ఒకటో విక్రమాధిత్యుడి భార్య వేయించిన శాసనముంది.

               ఇక్కడి మహాద్వారం సమీపంలోని ఓ శిథిల ఆలయ నిర్మాణాన్ని పల్లవ నరసింహవర్మ చేసివుండవచ్చని, గర్భాలయ ద్వారా బంధంపైగల ప్రలంబుపాత గజలక్ష్మి పల్లవ సంప్రదాయాన్ని తెలియజేస్తోందని, స్తంభాలపై శిలాకారణ, చండదేవ అనే పేర్లు చెక్కబడ్డాయని పేర్కొన్నారు. 8వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులను రాష్ట్ర కూటులు జయించి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు.

             ధారా వర్షధ్రువుడనే రాజు కాలంలో అతని సేనాపతి బలవర్మ ఈ క్షేత్రంలో మహాద్వారాన్ని నిర్మించి శాసనం వేయించాడు. బాదామీ శాఖకు చెందిన కల్యాణి చాళుక్య వంశస్తులు క్రీస్తుశకం 973 నుంచి 1161 వరకు ఈ ప్రాంతాన్ని పా లించి జోగుళాంబ శక్తిపీఠంలో యోగానంద నారసింహాలయం, సూర్యనారాయణ ఆలయం, నదీతీరంలోని స్నాన ఘట్టాలు, పాపనాశినీ తీర్థంలోని ఆలయాలను నిర్మించారు.

              వీరు కాలాముఖ, లకులీశ శైవాచార్యుల ఆధ్వర్యంలో విద్యాపీఠాలు నెలకొల్పారు. చెన్నకేశవ, శివాలయాలు నిర్మించారు. క్రీ.శ.1521లో శ్రీకృష్ణ దేవరాయలు రాయిచూరును గెలిచి చెన్నిపాడు మీదుగా అలంపూర్‌ను చేరుకున్నాడు. ఇక్కడి బాలబ్రహ్మేశ్వరుడికి, నృసింహ స్వామికి కొన్ని దానాలు చేసి శాసనాలు చెక్కించాడు.

              ఆ క్రమంలో అలంపూర్ సీమను మహామండలేశ్వర బసవరాజు పరిపాలించాడు. అనంతరం క్రీ.శ 1672-87 కాలంలో చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ అబుల్‌హసన్ తానీషా ఏలుబడిలో బిజ్జుల తిమ్మ భూపాలుడనే విధ్వాంసుడు ఆలంపూర్‌ను పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

               శతాబ్దాల చరిత్రగల మహా మహిమాన్విత ఆలంపూర్ జోగుళాంబ క్షేత్రం గురించి పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తే చారిత్రక ఆధారాలు, నాటి సంస్కృతీ సంప్రదాయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


           అలంపూర్,  కర్నూల్ దగ్గర, మహబూబ్ నగర్ జిల్లా
హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే దారిలో కర్నూలుకి 12 కి.మి ముందు వచ్చే అలంపూర్ అడ్డరోడ్ నుండి 10కి.మి ఎడమకు ప్రయాణిస్తే అలంపూర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో వాయువ్య దిక్కున తుంగభద్రానది ఒడ్డున జోగుళాంబ అమ్మవారి గుడి ఉంది.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment