Thursday, 2 February 2017

ఈ రోజు అనగా 03.02.2017 శుక్రవారము సప్తమి ఈ రోజు రథసప్తమి


ఈ రోజు అనగా 03.02.2017 శుక్రవారము సప్తమి    
 ఈ రోజు  రథసప్తమి

           ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం.
            ఏడు గుర్రాలు పూన్చిన సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది, సూర్యుడు తన దిశానిర్దేశాన్ని ఈ రోజునుండే మార్చుకుంటాడు. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడిగానూ, సాయంత్రం విష్ణు స్వరూపుడిగానూ ఉంటాడు కాబట్టి మనం సూర్యుడిని త్రిసంధ్యలలో ప్రార్థించినంత మాత్రమునే త్రిమూర్తులకు పూజ చేసినంత ఫలితం ఉంటుంది.
            శీతాకాలం నుండి వేసవి కాలపు సంధిస్థితిలో వచ్చే పండుగ ఇది. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది. సూర్యుడికి ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, సూర్యుడి రథానికి పూన్చినవి ఏడు గుర్రాలు, వారంలో రోజులు ఏడు, వర్ణాలలో రంగులు ఏడు, తిథులలో ఏడవది సప్తమిరోజు. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని స్నాన, జప, అర్ఘ్యం, తర్పణ, దానాలు అనేక కోట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంది.
             సప్తమిరోజున షష్ఠి తిథి ఉన్నట్లయితే షష్టీ సప్తమీ తిథుల యోగానికి పద్మం అని పేరు. ఈ యోగం సూర్యుడికి అత్యంత ప్రీతికరం. సూర్యుడికి 'అర్కః' అనే నామం కూడా వుంది. అర్క అంటే జిల్లేడు ఆకు అందుకే సూర్యుడికి జిల్లేడు అంటే అమిత ప్రీతి. రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై పెట్టుకుని

శ్లో || సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ |
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్ ||

మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా |
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద: ||

         షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం.

శ్లోకం//
       జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
       సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || -

 అనే మంత్రంతో స్నానం చేయాలి.
భావం.
       సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము.
           అని జపిస్తూ నదీస్నానం చేసినట్లయితే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రభోదించాడు. స్నానం అయిదు రకాలు నదీ స్నానం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి సూక్తము, సంకల్పము, మార్జనము, అఘవర్షనము, తర్పణము. తెల్లవారు ఝామున నాలుగు నుండి ఐదు గంటల లోపల స్నానం అది ఋషిస్నానం అంటారు. ఐదు నుండి ఆరు లోపల చేస్తే అది దైవస్నానం, ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేస్తే అది మానుష స్నానఫలం, అటు తరువాత చేసేదే రాక్షస స్నానం.
          భార్యాభర్తలు నదీ స్నానం చేసే సమయంలో కొంగును ముడివేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత నాలుగు గుప్పిళ్ళ మట్టిని నదిలోనుంచి తీసి గట్టుపై వేయాలి. దీనివల్ల మనం చేసిన స్నాన ఫలం ఆ నది త్రవ్వించిన వారికీ కొంత చెందుతుంది, పూడిక తీసిన ఫలితం మనకు దక్కుతుంది. రథసప్తమిరోజున సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. బంగారు, వెండి, రాగి, వీటిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదలో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పట్టుకొని, నది లేదా చెరువు దగ్గరకు వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదలి, ఎవరూ నీటిని తకకకుందే స్నానం చేయాలి.
           స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి. సూర్యుడి ముందు ముగ్గు వేసి, ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగానూ ఉంటుంది. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.

          రథసప్తమి రోజున సూర్యుడికి పూజలు, దానధర్మాలు, వ్రత పారాయణ, ఉత్తములు, అర్హులైన వారికి దానం ఇవ్వాలి అని ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్నీ కృష్ణుడు, ధర్మరాజుకు చెప్పాడట. ఆ కాంభోజ రాజు కథ ఏమిటంటే

             పూర్వకాలం కాంభోజ దేశాన్ని యశోవర్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడు అన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే దక్కింది. పుట్టిన బిడ్డ ఎప్పుడూ ఎదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. అలా జబ్బుపడిన కొడుకునుచూసి రాజుకు ఎంతో దిగులు వేసింది.
             ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి వివరించి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గతజన్మను వీక్షించారు. గతజన్మలో ఎంతో సంపన్నుడు అయినా ఎవరికి కూడా ఎటువంటి దానం కూడా చేయలేదు.
            అయితే అతడి జీవితం చరమాంకంలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు కాబట్టి ఆ పుణ్యఫలం కారణంగా రాజు ఇంట జన్మించాడు. సంపదలు ఉండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు తెలియజేశారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమని మహారాజు ఋషులను వేడుకున్నాడు.
               అంతట ఋషులు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడికి సంక్రమించిన రోగాలు నశిస్తాయని చెప్పారు. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని చెప్పారు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు అంటూ విధివిధానాలను వివరించారు. కాంభోజ మహారాజు కూడా తన బిడ్డతో రథసప్తమి వ్రతాన్ని చేయించిన తరువాత ఆ బిడ్డ సర్వ రోగాలనుండి విముక్తి పొంది తరువాతి కాలంలో రాజ్యానికి రాజయ్యాడు.
             ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమినాడు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని నదీస్నానం చేసి దగ్గరలోని సూర్యదేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటివద్దనే ఆరాధించుకోవచ్చు. ఈ వ్రతానికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్యజీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.


        ఈ రథసప్తమి నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమల యందు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజు ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవం లలో స్వామి వారు రోజుకొక్క వాహన రూడుడై భక్తులకు ధర్శన భాగ్యం కలిగించునట్టుగా ఈ  రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, 'రథసప్తమి'ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

            ఫిబ్రవరి 3 శుక్రవారము తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.  
............................
ఆర్జితసేవలు మరియు ప్రత్యేక దర్శనాలు రద్దు :
............................
          శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 3న నిర్వహించే ఆర్జితసేవలైన నిజపాద దర్శనం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
          రథసప్తమినాడు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వికలాంగులు, వయోవృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతల ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు కంపార్ట్‌మెంట్లలో యాక్సెస్‌కార్డుల జారీని నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
....................................................
ఈ రథ సప్తమీ నాడు మలయప్ప స్వామీ ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే  సమయము
....................................................
ఉ. 5.30 - ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.44 గంటలుగా నిర్దేశించారు)

ఉ. 9.00 - ఉ. 10.00 చిన్నశేష వాహనం

ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 - మ. 2.00 హనుమంత వాహనం

మ. 2.00 - మ. 3.00 చక్రస్నానం

సా. 4.00 - సా. 5.00 కల్పవృక్ష వాహనం

సా. 6.00 - సా. 7.00 సర్వభూపాల వాహనం

రా. 8.00 - రా. 9.00 చంద్రప్రభ వాహనం
ఓం నమో వేంకటేశాయ

మీ
వేద,శాస్త్ర,స్మార్త, పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment