Monday, 25 April 2022

గంగా మాహాత్మ్యం

శ్రీ మహాభారతం - అనుశాసనిక పర్వం - 19
* భీష్ముడిని దర్శించిన అత్ర్యాది ప్రముఖ మహర్షులు.
* గంగా మాహాత్మ్యం 

             శరశయ్యపై శయనించిన భీష్ముడు ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధిస్తున్న సమయంలో ఆయనను దర్శించుటకు అత్రి మహర్షితో సహా అనేక మంది మునులు, మహర్షులు తమ శిష్య బృందంతో వచ్చారు. వారి తపోమహిమతో నిండిన కాంతి సర్వత్రా వ్యాపించింది. శరశయ్యపై పడివున్న భీష్ముడి పరిస్థితి వారు పరిశీలించి చూశారు. పాండవులు వారికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని దర్శించిన అనంతరం మునులు అదృశ్యమై పోయారు. వారు వెళ్ళిన పిమ్మట పాండవులు వారి చరిత్రలను గురించి ముచ్చటించు కొన్నారు. ఆ తరువాత యమనందనుడు తాతగారి పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించి తాతా! ఏ ఊళ్లు, కొండలు నదులు ఏ రకమైన మహిమ కలవో తెల్పు’మని కోరాడు. 

* భీష్ముడు చెప్పిన గంగ ప్రభావం *
ధర్మరాజా! పూర్వం భిక్షాటన చేసే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక సిద్ధయోగి అతిథిగా వచ్చాడు. ఆ విప్రుడు అతనికి అర్ఘ్య పాద్యాదులతో మర్యాదలు చేసి నీవడిగి నట్లే ఆయోగిని అడిగాడు. అప్పుడు అతను బ్రాహ్మణోత్తమా! ఏ దేశాల మధ్య నుండి గంగ ప్రవహిస్తుందో ఆదేశాలలో వున్న నదులు, పర్వతాలు అన్నీ పవిత్రాలే. గంగకు త్రిపథ అని పేరున్న సంగతి నీకు తెలిసిందే కదా! ( స్వర్గంలో మందాకినీ, భువిపై భాగీరథి,పాతాళంలో భోగవతి) అటువంటి గంగను సేవిస్తే యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు, త్యాగాదులచే కలిగే ప్రయోజనం కంటే అధిక ఫలితం చేకూరుతుంది. 

'మేనించుక సోఁకినగంగానదితోయములుజనుల కల్మష కోటిం బో నడచి పురందర లో కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ!'

             కొంచము గంగానది నీరు శరీరానికి సోకితే చాలు మనిషి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా స్వర్గ లోక ఆనందం కలిగిస్తుంది. గతంలో ఎన్ని పాపాలు చేసివున్నా గంగలో మునిగితే - సూర్యుని రాకతో చీకట్లు వైదొలగి పోయినట్లు - ఆ పాపాలన్నీ పటా పంచలౌతాయి. మరణించిన పిమ్మట అతడు స్వర్గానికి చేరగలడు. మనిషి ఎముక గంగ నీళ్ళలో ఎన్నేళ్ళు వుంటుందో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గలోకంలో సుఖాలు పొందుతూ ఉంటాడు. 

            విప్రవర్యా! సోమంలేని యజ్ఞం, చంద్రుడులేనిరాత్రి, సూర్యుడులేని ఆకాశం, స్వధర్మంలేని ఆశ్రమం, పువ్వులు లేని చెట్లు ఎలా శోభించవో అదే విధంగా గంగ లేని దేశం కూడా శోభనివ్వదు. ఎన్ని చాంద్రాయణ వ్రతాలు చేసినా గంగ నీరు త్రాగినంత ఫలితం రాదు. సకల పాపాలు గంగలో మునిగితే పోతాయి. అగ్నిలో పడ్డ దూది వలె సమస్త జీవరాసులకు దుఖం పోగొట్టుకొనుటకు ఎన్ని మార్గాలున్నా అవి గంగతో సమానం కావు. 

'శరణంబు లేని జనులకుఁ బరమ శరణ మండ్రు మునులు భాగీరథి, ని 
ర్జరులకు నమృతము లత్తుల నరులకు గంగాజలం బనఁగ నే విందున్'

         విప్రోత్తమా! దిక్కులేని జనులకు గంగ గొప్ప దిక్కని మునులంటారు. దేవతలకు అమృతమెట్లాగో, నరులకు గంగ నీరు అటువంటిదని అనడం నేను విన్నాను. 

'తలపై జాహ్నవి వాలుకా యలికి కొనిన ఫాలతటిఁ దదంతర్మృత్సం
కలితముఁ జేసిన బాపంబులు దొలఁగు సుపర్ణు గనిన భుజగముల క్రియన్'

         తలమీద గంగ ఇసుక, నొసటిపై గంగ మన్ను రాసుకొంటే గరుత్మంతుడిని చూసిపాములు పారిపోయినట్లు పాపాలు తొలిగి పోతాయి. గంగా తరంగాల తుంపర్లు చిందే గాలి శరీరానికి తాకితే అతడి పాపాలన్నీ అప్పటికప్పుడే పోతాయి. మానవుడు గంగాస్నానం చేస్తే పదునాలుగు తరాల పితృదేవతలను పావనులౌతారు. గంగను చూసినంత మాత్రాన మాట, మనస్సు శరీరం వలన కలిగిన పాపాలన్నీపోతాయి. గంగను గురించి విన్నా, గంగ ఉత్సవాలు చేసినా, చూసినా, గంగను చేతితో తాకినా అది రెండు వంశాల (పుట్టినింటి,మెట్టినింటి) వారి పితృదేవతలను స్వర్గానికి పంపిస్తుంది అటువంటప్పుడు ఇక స్నానం చేస్తే వారికి ఎంత పుణ్యం వస్తుందో వర్ణించలేను.

'విను, గంగ గంగ యను కీర్తనములతో నొండు నీటఁ దగ మునిఁగిన య 
జ్జనులు దురితములఁ దొఱఁగుదు రని యార్యులు సెప్ప విందు సంచిత చరితా!'

          గంగా! గంగా! అంటూ పరవశంతో గంగను కీర్తిస్తూ ఏ నీటిలో మునిగినా పాపాలు పోతాయని పెద్దలంటారు. చూడడానికి శక్తి వుండి గంగను చూడని వాడు పశువుతో సమానుడు. ఇంద్రాది దేవతలే గంగ కావాలనుకొంటే నరులు అనుకోకపోవడం ఉచితమా! ప్రాణం పోయే సమయానైనా గంగను తలచినంత మాత్రాననే ముక్తి కలుగుతుంది. రాజ, చోర, పాప భయాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి. శివుడే ఆ దేవత స్వర్గము నుండి కదలి వస్తే తన నెత్తిన పెట్టుకొన్నాడు కదా! 

'మూడు పథములఁ జని లోకములకు మూఁటి కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి
యమలతర మూర్తి యగు దేవి నాశ్రయించు వాఁడు కృత కృత్యుఁడిది నిక్కువము కృతాత్మ!'

            బ్రాహ్మణోత్తమా! మూడు మార్గాలలో ప్రవహిస్తూ ముల్లోకాలకు గొప్ప అలంకార భూషణమై కీర్తిని కలిగిస్తూ ఉండే నిర్మల మూర్తి గంగాదేవిని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. మానవులకు ఇంద్రుడు,గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు, ఎలాగో అలాగే మనుష్యులకు అన్ని విషయాలలో మాహాత్న్యం గల గంగ గొప్పది. కపిలుడు శాపం వలన సాగర పుత్రులు భస్మరాశులై ఉండగా గనగా ఆ భస్మ రాసులపై ప్రవహించి వారిని స్వర్గానికి పంపినదని చెప్పి సిద్ధుడు బ్రాహ్మణునకు నాకు తెలిసిన గంగా మాహాత్మ్యాన్ని నీకు వివరించాను కాబట్టి నీవు మనోవాక్కాయ నిర్మలుదవై గనగను సేవించు మని చెప్పి ఆకాశ మార్గంలో సిద్ధుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజా! తెలిసింది కదా గంగ గొప్పదనం నీవు కూడా గంగను ఆరాధిస్తే శాశ్విత సుఖవంతువంతుడిని చేస్తుంది, అని భీష్ముడు గంగ గొప్పదనాన్ని చెప్పాడు. 

       (స్వర్గంలో నున్న గంగ భువిపైకి ఎందుకొచ్చింది?: సగరచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా అతని యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి పాతాళంలో తపస్సు చేసుకొంటున్న కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతములో వదిలాడు. ఇది తెలియని సగర పుత్రులు అరవైవేల మంది తండ్రి ఆదేశంమేరకు అశ్వాన్ని వెదకుటకు వెళ్ళారు. భూమిపై వెదకి, వెదకి కనిపించక భూమిని త్రవ్వుకొంటూ పాతాళం దాకా వెళ్ళారు. అక్కడ కపిల ముని ఆశ్రమప్రాంతంలో అశ్వము వుండడం గమనించి కపిలుడే అశ్వాన్ని అపహరించాడని భావించి అయన పై దాడికి సిద్ధమయ్యారు. ఆసమయంలో కపిల మహర్షి చూసిన కోపదృష్టికి భస్మమై పోయారు. వారికి విముక్తి కలగాలంటే గంగను వారి భస్మ రాసులపై పవహింప చేస్తే ముక్తి కలుగుతుందని ముని చెప్పగా తరువాత ఆ వంశంలో జన్మించిన అంశుమంతుడు, దిలీపుడు మొదలగు వారు ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ తరువాత భగీరథుడు ప్రయత్నించి గంగను భువికి తెచ్చి పాతాళంలో వున్నతన ముత్తాతల భస్మరాసులపై ప్రవహింప చేసి వారికి విముక్తి కల్పించాడు.)

 భీష్ముడు : ధర్మరాజా! గంగాదేవి స్తోత్రంకూడిన ఈ పురాణ గాథను చదివినా, విన్నా రోగాలు పోవడమే కాక పాపాలు కూడా తొలిగి పోతాయిఅని చెప్పగా గంగ గొప్పదనం విన్న ధర్మరాజు తన తమ్ములతో కలిసి ఆయనకు నమస్కరించి మరొక సందేహం అడిగాడు 

No comments:

Post a Comment