Friday, 25 August 2017

ఋషి పంచమి వ్రత కథ


ఋషి పంచమి వ్రత కథ 


సర్వలోకమునకు గురువుఐన, సర్వేశ్వరుడు ఐన శ్రీ కృష్ణుని చూచి ' ధర్మరాజు ' ఓ దేవ దేవా! అనేక వ్రతములను గూర్చి విన్ననూ, వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది ఐన ఒక వ్రతము వినవలెనని ఉంది.

        అని చెప్పగా విన్న శ్రీ కృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మ రాజా చెప్పెదను వినము దేనిని చెయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది ఐన ' ఋషి పంచమి ' అను వ్రతము ఒకటి ఉంది. దానిని గూర్చిన పురాణ కథ ఒకటి ఉంది.

           పూర్వకాలమున ' విదర్భ దేశం'లో ' ఉదంకుడు ' అను ఒక ' బ్రాహ్మణుడు ' కలడు. అతని భార్య పేరు 'సుశీల' ఈమె పతివ్రత వీరికి సుభీషణుడు అను కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదే వేదాంగములను చదివెను. కూతురుని ఒక బ్రాహ్మణునకు ఇచ్చి ' వివాహం ' చేసిరి ఆ తరువాత ఆమె 'విధ వశము' చే వైధవ్యమును పొందెను. ( అనగా భర్త లేనిదయ్యెను) తాను పవిత్రముగా ఉండి, తన తండ్రి ఇంటిలోనే కాలము, గడుపు చుండెను.

           తండ్రి ఐన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధ పడుచు కొడుకు ఇంటి నుంచి భార్యను, కూతురును తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు ' జ్ఞాన బోధ' చేయుచుండెను. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరి చర్యలు (సేవలు) చేయు చుండగా ఒకానొక రోజున అర్ద రాత్రి వేళ, అలసి నిద్రిస్తుండగా ఆమె దేహమంతా పురుగులు పట్టినవి.
          ఇలా శరీర మంతా పురుగులతో నిండియున్న ఆమెను చూచి 'శిష్యులు' ఆమె తల్లికి చెప్పిరి. అది విని తల్లి బాధ చెంది, ఆమె శరీర మునకు ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకొని తన భర్త ఐన ఉదంకుని దగ్గరకు పోయి, జరిగిన దంతా వివరించి చెప్పి, ఇందుకు కారణము తెలుపమని కోరగా ఉదంకుడు కొంత సేపు 'ధ్యాన ముద్ర'లో ఉండి ఆమె పూర్వ జన్మ వృత్తాంత మంతయూ గ్రహించి ఇలా చెప్పెను.

          ఓ ప్రాణేశ్వరీ! ఆమె ఇంతకుముందు తన ఏడవ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి 'రజస్వల' యై దూరముగా నుండక ఇంటి పనులు అన్ని చేయుచూ వంట సామాగ్రిని (అనగా అన్నము, కూర, పప్పు, మొ|| పదార్దములు వండిన గిన్నెలు|| వాటిని) తాకిన దోషము వలన ఆమె శరీర మంతట పురుగులు వ్యాపించనవి, కావున 'స్త్రీ' రజొయుక్తరాలు ఐనచో పాపము కలది అగును.

           అది యెట్లు అనగా మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మఘాతి ( అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగను) మూడవ రోజున రజకి ఐ నాలుగవ దినమున శుద్ధ అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కాని, ఆ వ్రతము చేయుటను చూచి ఉండుట వలన నిర్మలమైన బ్రాహ్మణకులంలో పుట్టుట జరిగినది ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగుల కలదిగా అయ్యెను.

        అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంత మను గూర్చి చెప్పగా అతని భార్యైన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీర మంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్య కరమైన వ్రతము గూర్చి నాకు తెలపువలెను.అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధముగా చెప్పుచుండెను.

          ఏ వ్రతము చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యములు, సకల ఐశ్వర్యములు కలుగునో సర్వపాపములు తొలగునో, అంతే గాక ఆపద లేని సంపదలు వర్దిల్లునో అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి ఉంది. అన్న శ్రీ కృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు.
          ఓ శ్రీకృష్ణ ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అనిన శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ రాజేంద్రా ఏ వ్రతము చేసినచో ఆడువారు సర్వపాపముల నుండి విముక్తి పొందెదరో ఆ వ్రతమును గూర్చి నీకు తెల్పెదను. అని ఇలా వివరించుచుండెను.

        'ఋషి పంచమి' వ్రతము అను ఒక వ్రతము ఉంది. 'ధర్మ రాజు' అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈవిధముగా పలుకుచున్నాడు. ఒక స్త్రీ 'రజస్వల' ఐనందున తెలిసిఐననూ, తెలియక ఐననూ వంటచేయు (పాత్రలను) భాండ ములను తాకినచో అది పాపమే అగును. బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులలోను స్త్రీలు రజొవతులుగా ఉండునపుడు దూరముగా ఉండుటకు హేతువు ఉంది.

         అనగా కారణము ఉంది. అది ఏమనగా ఇంద్రుడు ముందు వృత్రాసురుని చంపినపుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి, ఆపీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగములుగా విభజించి ' స్త్రీ 'లయందును, వృక్షములయందును (అనగా నీటి యందును) ఈ విధముగా నాలుగు తావులయందు (అనగా నాలుగు స్థలముల యందు) ఉంచెను.

         కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మఘాతి, మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్ధము అగును కావున, రజః కాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో ( అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపములు తొలగి పోవుటకు సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ 'ఋషి పంచమి' వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. (అనగా చేయ దగినది)

ఈవిషయమున ఇంకొక పురాణ కథ ఉంది.

            మొదటగా కృత యుగమున విర్భ దేశమునందు ' శ్వేన జిత్తు ' అను పేరుగల ఒక రాజు నాలుగు (అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర) జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పద శాస్త్ర హితామహుడ ( అనగా పదములు చెప్పుటలో పాండిత్యము కలిగిన వాడు) అన్ని ప్రాణులయందు లేద ఆజీవులయందు దయ కలవాడైన సుమిత్రడు అను ఒక బ్రాహ్మణుడు కలడు.

           ఇతడు వ్యాపారము చేయుచూ కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది. అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో నుండి, జయ శ్రీ అను పేరుతో విలసిల్లుచుండెను. ఇలా ఉండగా ఒక సారి రజస్వల ఐ ఇంటి పనులు చేయుచూ, వంట సామగ్రిని తాకి భర్తతో కూడి ఉండి, పాపకర్మ చేయుటచే కొంత కాలమునకు భార్య భర్తలు ఇద్దరూ చనిపోయిరి.

          ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వలా నియమమును తిరస్కరించినది (అనగా నియమం పాటించ లేదు) కావున ఆ పాపము వలన ఆడ కుక్కగాను ఆమె రుతుమతిగా ఉన్నపుడు భార్యతో నుండుట చేత సుమిత్రుడు వృషభము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టిరి.

             ఆ సుమిత్రుని కొడుకు ఐన సుమతి అనువాడు ధర్మములను తెలిపిన వాడు, పెద్దల యందు భక్తి కలవాడు. దేవతలను, అతిధులను పూజించువాడై ఉండెను. ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన (తద్దినము) రోజు వచ్చనది అప్పుడు తన భార్యైన ' చంద్రవతి ' అనునామెను పిలిచి శ్రద్ధ తోను భక్తి తోను ఇలా పలికెను.

          ఓ దేవీ! మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. అందుకై వంట చేయుమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాకములను (అనగా అనేక పిండి వంటలను చేసెను) చేసి వాటిని సిద్దము చేయుచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తినుచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిన చూచెను.

         అది తినినచో బ్రాహ్మణులందరూ మరనింతురు.అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరూ ముట్టరు అనుకొని అది అన్నమును తినుచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను.

        ఆ ఆహార పదార్దములను పార వేసి, మరల శుభ్రముగా వండి, బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి, పిదప మిగిలిన వాటిని ఇంట్లో నివారంతా భుజించి మిగిలిన పదార్దములను కూడా ఆ కుక్కకు వేయక పోవుట వలన అది తన భర్త రూపములో నున్న వృషభము (అనగా ఎద్దును) చూచి ఇలా పలుకుచున్నది.

       ఓ స్వామి! నేడు ఉచ్చిష్టము (అనగా అందరూ తినగా మిగిలినది) వెయక పోవుట వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది గాక బ్రాహ్మణుల కొరకు శ్రార్దమునకై చేసిన పాకములో ఒక సర్పము (అనగా పాము) వచ్చి అక్కడి పాయసము తిని, విషము దానిలో కలిపి పోయెను అది నేను చూచి, ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్దములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదురని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయెదను అని అనుకొని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్దము చేసుకొని నన్ను బాధించింది. అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ (శునకము) అనగా కుక్కను ఆ (వృషభము) ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను.
     
         శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్థించి, దంత ధావనం చేసి, (అనగా పండ్లను శుభ్రముగా కడుగుకొని) తిలామలక పిష్ఠములచే కేశసంశోధం చేసుకుని (అనగా నువ్వుల నూనెను వ్రాసుకుని) మృత్తి కాస్నాన పూర్వకముగా శుద్ధోదక స్నానము (అనగా ఎవరైనా మరణించిన తరువాత చేయు స్నానము అని అర్దము)

          పరిశుద్ధ మైన వస్త్రములను కట్టుకొని యధా విధి కర్మలు ఆచరించి (అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞ మునకు కావలసిన అన్ని సామగ్రులను సిద్దము చెసికొని భక్తి యుక్తుడై సప్తర్షులను ఆవహింప చేసి శుభములైన పంచామృత రసములచే వారిని సంత్రుప్తులను గావించి, అభిషిక్తులను గావించి, చందన, అగరు, కర్పూరాది సుగంధములను అలంకరింపచేసి, అనేక విధములైన పువ్వులతో వారిన పూజించి, వస్త్రయజ్ఞో పవితముల చేత కప్పి ధూప దీప నైవేద్యములు పెట్టి అనేక శాకములు (అనగా కరలు) పాయసములు అనగా పరమాన్నములు మొ||న ఆరురుచులుగల షడ్రశోపేత భోజనం పెట్టి ఫలములచే అర్ఘ్యము ఇచ్చి

శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః
          జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ ||

             అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ' ఋషి పంచమి ' వ్రతమును యధాశక్తి ఆచరించి తన తల్లితండ్రులను బ్రతికించుకొనెను. ఈ విధముగా ' ఋషి పంచమి ' వ్రతమును సప్త ఋషుల సహితముగ ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది, ఆ ఫలమును తల్లి తండ్రులకు ఇచ్చి, వారిని బ్రతికింపచేసెను.

              వారు బ్రతికి ఆమర లోకమునకు అధిపతులు ఐనారు. కావున ఈ వ్రతమహిమ చేత కాటుక వాచిక మానసిక ( అనగా శారీరకమైన దోషములు) తొలగిపోయి కలిగెడు పుణ్యమును గూర్చి వివరించెదను అని ఓ రాజా అన్ని వ్రతములు ఆచరించి ఫలము, అన్ని నదులలో స్నానము చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయుటవలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును.

                ఏ 'స్త్రీ ' ఈ వ్రతం ఆచరించునో ఆ ' స్త్రీ ' భోగభాగ్యము కలిగినది, రూపము, సౌందర్యము, పుత్రులతోను పౌత్రులతోను కూడిన దైఇహపర సౌఖ్యములను పొందినది అగును. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును. మరియు చదువు వారి వినువారి పాపములు నశింపచేయుటయే గాక ధనము, పుత్రులు, కీర్తి, స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా! ఈ వ్రతములలోకి శ్రేష్ఠము అనిన శ్రీకృష్ణుని మాటలు విని, అజాత శత్రువుఐన ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు

ఉద్యాపన ఘట్టము:

              ఓ దేవకీ నందనా ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఎలా? సుమతి ఎలా చేసాడు దాని వివరము చెప్పవలెను అనిన వసుదేవ సుతుడు ఇలా చెప్పుచుండెను.

          ఓ కుంతీ కుమారా! మొదటి రోజున అనేక ఆహార పదార్ధములను చేసి, ప్రోద్దునేలేచి, స్నానముచేసి, గురువుదగ్గరకు చేరి ఆ గురువును చూచి, ఓ స్వామినే చేయు ఉద్యాపనము ఆచార్యుండ వైఉండుము అని ప్రార్థించి ముందు చెప్పిన విధి ప్రకారము భక్తితో ప్రార్థించి పరిశుద్ధ ప్రదేశమును అలికి, అందు సర్వతొ భద్రమండలమను ఏర్పరచి (అనగా రాగి పాత్రైనకావచ్చును, రాగి చెంబుతో కలశమును తయారు చేసుకొనవలెను.

           ఆ చెంబునకు వస్త్రసూత్రమును కట్టి, పంచరత్నములను ఇచ్చి, పూలు, పండ్లు, గంధము, అక్షతలు మొ||గు వాటిచేత అర్పించి, ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలెను.

            ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో (అనగా బంగారం, వెండి, రాగి మొ||వి ఏదైననూ శక్తిని మించక అనగా తమకున్న శక్తితో సప్తఋషుల బొమ్మలు చేయించి ఆ కలశములమీద ఉంచి ఫలపుష్పములతో కూడిన పంచవర్ణ నితానంబులను కట్టించి సమస్త పూజాద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యషమహర్షి మొ||న సప్తఋషులను పూజించి, అరుంధతితో కూడిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్టులారా, నాచేత ఇవ్వబడిన అర్ఘ్యము తీసుకొని సంతోషములతో ఉండమని ప్రార్థించి,

          ఈవిధముగా పూజచేసి, స్థిరమైన మనసు కలవాడై, ఇలాంటి విధానముచే ఈవ్రతము ఏడు సంవత్సరముల చేయవలెను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదవేదాం పారంగతులైన గురువులను ఋషులను పూజించి జటాజుటాసూత్రక మండల సమన్వితులును (అనగా బొమ్మలను) ఆకలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి, విధ విధానము చేత సప్తర్షులను పూజించి, ఆ రాత్రి పురాణము చదువుటచేతను, వినుట చేతను జాగరణము చేసి, మరునాడు ఉదయమున స్నాన సంధ్యావంద నాదికములు ఆచరించి నిత్య కృత్యములు తీర్చుకొని (అనగా కాలకృత్యములు తీర్చుకొని) వేద మంత్రముల చేత నైననూ, పురాణములో చెప్పిన మంత్రములచేత నైననూ, వారి వారి అధికారమును అనుసరించి నువ్వులనూనె మొ||గు వాటిచే ఆ మంత్రములు చెప్పి, అష్టోత్తర, సహస్రములచేత నైనను లేక అష్టోత్తర శతనామములతో నైన వేరువేరుగా అర్చించవలెను.


         ఇట్లు చేసి, మరల పూజచేసి బంగారు ఆభరములు, వస్త్రకుండలములు అమృత భోజనములు ( అనగా పిండి వంటలు, పాయస పదార్ధములు మొ||న నెయ్యి, పెరుగు మొ||న వాటితో కూడిన పదార్ధములు) ఇలా అనేక దానములచే గురువును సంతోషపెట్టి, వస్త్రములతో (బట్టలతో అలంకరింపబడిన ఏడుగురు ఋగ్వేదము పాడు 'ఋత్వికులకు' వస్త్రములను యజ్ఞో పవీతములను, దక్షిణలను భక్తితో ఇచ్చి పూజించి, భార్యతొ కూడిన గురువునకు ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారములు చేసి,

          అతని 'ఆజ్ఞ' (అనగా మాటను తీసుకొని వ్రతము పూర్తి చేసి, ఆ తరువాత భక్తితో మృష్టాన్నము (అనగా పంచ భక్ష, పాయసములతో కూడినది) పెట్టి బ్రాహ్మణులను తృప్తి పరచి దీన జనులకు భోజనము పెట్టి, ఋత్తికులకు తాంబూల దక్షిణలు ఇచ్చి సప్తర్షుల బొమ్మలను దానముచేసి, వారిచే ఆశీర్వాదము పొంది, వారి ఆజ్ఞను తీసుకొని ఇష్టమైన చుట్టములతో కూడి భుజింపవలెను.

           ఓ ధర్మరాజా ఎప్పుడూ ఫలం కోరువారు ఇలా చెప్పబడిన విధమున ఉద్యాపనము చేసి, ఈ వ్రతం చేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును, అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును.

          కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడా పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment