*ప్రశ్న :
కొందరు దేవతలకు కొన్ని కుసుమాలు పడవు అంటారు. దేవతలంతా ఒకటే అయినప్పుడు ఈ పడకపోవడాలు ఏమిటి అంతేకాక - ఏ కుసుమాలు పూజకు వాడరాదో తెలియజేస్తారా ??*
గురువర్యులు సామవేదం షణ్ముఖ శర్మ గారి
*జవాబు :*
దేవతలంతా ఒకటి - అనలేం. పరబ్రహ్మ ఒక్కడే, దేవతలు ఆ పరతత్త్వము యొక్క విభిన్న శక్తులు.
మంత్రం - దేవత. ఈ రెండూ వేదాదుల్లో చెప్పబడ్డాయి. ఒక్కొక్క భావానికీ ప్రాధాన్యమిస్తూ, దానికి అంగాలుగా మిగిలిన భావాలుంటాయి. మానవులకు వారివారి జీవలక్షణ, సంస్కారాలకు అనుగుణంగా ఆయా దేవతలయందు
ప్రీతి కలుగుతుంది. భక్తానుగ్రహ విగ్రహమ్ - అన్నారు పరమాత్మను. మంత్రం ద్వారా అధిదేవత చెప్పబడుతుంది. ఆ మంత్రానికీ, అధిదేవతకీ, ఉపాసనకీ సంబంధం ఉంది. ఒక్కొక్క మంత్రానికీ ఒక్కొక్క శబ్దశక్తీ, ఒక్కొక్క దేవతారూపం ఉంటుంది.
విద్యుత్తు ఒక్కటే అయినా ఫ్యాన్, దీపం, టీవీ, ఫ్రిజ్ -ఇలా వేటి ప్రత్యేకత, వేటి పద్ధతి వాటిదే కాదా!
అలాగే దేవశక్తిని ఆవిష్కరించడానికి అనువైన పదార్థాలు ఉంటాయి. తులసితో గణపతినీ, దూర్వాలతో దుర్గని పూజించరాదు. ఆ దేవతామూర్తుల లక్షణాలవి. అయితే వినాయకచవితి నాడు ప్రత్యేకంగా ఏకవింశతి పత్రాలలో ఒకటిగా తులసిని పూజించవచ్చు. దూర్వాలతో గణపతిశక్తిని సులభంగా ఆవిష్కరించవచ్చు. ఒక్కొక్క కామ్యానికీ ఒక్కొక్క దేవతాశక్తి సహకరిస్తుంది.
ఏ దేవతలకైనా పూజించే పువ్వులు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.
అపర్యుషిత నిశ్ఛిద్రైః
ప్రోక్షితైర్జంతు వర్జితైః।
ఆత్మారామోద్భవైర్వాపి
భక్త్యాసంపూజయేత్సురాన్ ॥
త్యజేత్కీటావపన్నాని
శీర్ణపర్యుషితాని చ
స్వయం పతిత పుష్పాణి
మలాద్యుపహతాని చ ॥
ముకులైర్నార్చయ యేద్దేవం
అపక్వైః కృమియుక్ఫలైః
ఛిద్రాలూ, పురుగులూ లేక, ఆరోజునే కోసిన పుష్పాలు తెచ్చి, నీటిని ప్రోక్షించి (శుద్ధజలం జల్లి), వాటితో దేవారాధన చేయాలి. ముందురోజు కోసి తెచ్చినవీ , పురుగు కొట్టినవీ, రాలిపోయినవీ, బురద అంటినవీ అయిన పువ్వుల్ని వాడరాదు.. ఇంకా మొగ్గవిడనివి వాడరాదు. ఫలాలు కూడా పక్వం కానివీ, పురుగుకొట్టినవీ వాడరాదు. ధర్మంతో ఆర్జించిన ధనంతో కొన్న కుసుమాది ద్రవ్యాలు - ముందు రోజు కోసినవి అయినా దోషము లేదని ధర్మశాస్త్రవచనం.
*ధర్మార్జిత ధనక్రీతైః*
*యఃకుర్యాత్కేశవార్చనం |*
*నపర్యుషిత దోషోస్తి*
*మాలాకార గృహేషు చ॥*
ఒకసారి వాడినవీ, ఎడమచేతితో గ్రహించినవీ, నీటితో తడిపినవీ, వస్త్రంలో పోసినవీ అయిన పువ్వుల్నీ పూజకై వినియోగించరాదు. అయితే తులసీ, బిల్వం (మారేడు) వంటివి ఒకసారివాడినవి మళ్ళీ వాడవచ్చు. వాటికి పర్యుషిత దోషం రాదు. తులసిని ఆదివారం మంగళ శుక్రవారాలు, పూర్ణిమ,అమావాస్య, సంక్రాంతి, ద్వాదశి
- తిధులు, అశౌచాలున్నప్పుడు కోయరాదు.
దూర్వాలు కూడా ఆదివారం కోయరాదు. బిల్వం బుధ, శనివారాలు కోయాలి. అష్టమి, చవితి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్యలు కోయరాదు.
కార్తిక మాసంలో
ఉసిరికపత్రాలు కోయరాదు. తులసిని స్త్రీలు కోయరాదు. పురుషులు కోసిన తులసితో స్త్రీలు పూజించవచ్చు.
మాలతీ, కేతకీ, మల్లిక, అశోక, చంపక, పున్నాగ, వకుల, ఉత్పల (నల్లకలువ) మొదలైనవి విష్ణు ప్రియాలు. తులసి సర్వాధికం.
'అర్కస్య కరవీరస్య బిల్వస్యవ కులస్యచ'... తెల్లజిల్లేడు, గన్నేరు, మారేడు, వకుళం - శివునకు ప్రియములు. ఉమ్మెత్తకూడా శివునకు ప్రియం. బిల్వదళం సర్వాధికం. సర్వకామప్రదం బిల్వం దారిద్రస్య వినాశనం||-- అని ధర్మశాస్త్రం. కొందరు పువ్వుల్ని తీసుకొని రెక్కలు చిదిమి పూజిస్తారు. అలా వాడరాదు.
పత్రం పుష్పంఫలం చైవ
యథోత్పన్నం తథార్పయేత్||
పత్ర పుష్పఫలాదులు ఎలా ఉత్పన్నమయ్యా యో అలాగే అర్పించాలి. కమలాలు (పద్మాలు - తామరలు) సర్వదేవతలకు ప్రీతికరం. అమ్మవారికి వావిల పూవులు, మంకెన, అవిసె కుసుమాలు, బిల్వపత్రాలు, గన్నేరు, వకులం కూడా ప్రీతికర కుసుమాలు. బిల్వాలు, తులసి ఆకులు వేరుచేసి పూజించరాదు. దళాలుగా తీసి పూజించాలి.
*సామవేదం షణ్ముఖ శర్మ గారి నుండి సేకరణ :*
No comments:
Post a Comment