Tuesday, 5 September 2017

భాద్రపదమాసం బహుళ పాడ్యమి (06.09.2017, బుధవారం) మహాలయ పక్షం ప్రారంభం

మహాలయ పక్ష ప్రారంభం

మహాలయ పక్షము
             భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు.
                అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.
            ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.
 
         ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు. పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెలరోజుల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలూ మునులూ మరణించారు.

      కాబట్టి దాన్ని 'మహాలయం' అనారు.అదే 'మహాలయ పక్షం' అయింది. అందుకే ఈ పదిహేనురోజులూ శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణప్రవచనం.

              అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైనా అన్నశ్రాద్ధం పెట్టాలనీ అదీ కుదరనివారు హిరణ్యశ్రాద్ధం చేయవచ్చనీ, అది కూడా చేసే తాహతులేనివారు పితృదేవతలను తలచుకుని కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

          పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:

1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తిధి

            వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు.
       తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు

1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
3. తదియ (అధి దేవత - గౌరి)
4. చవితి (అధి దేవత - వినాయకుడు)
5. పంచమి (అధి దేవత - సర్పము)
6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
8. అష్టమి (అధి దేవత - శివుడు)
9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
10. దశమి (అధి దేవత - యముడు)
11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)

మహాలయ పక్షం.....! 

         మహాలయ పక్ష ప్రారంభం /శుద్ధ పూర్ణిమ పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం.

      గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

           పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

 ఉదాహరణకి
         ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి.

       దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది.

            ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది.

              పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు.

             పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు.

            సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.

      ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి.

       శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.

           అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తిధులలో చేస్తే వచ్చే ఫలితం చూద్దాం

 పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది

విదియ యనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది

 తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు

చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు

పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.

 సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

 అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి

 నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది

దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది

ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది

 ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.

 త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

 చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

 అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.

        ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.

              ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు.

         శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

            ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

           ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి.

            కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి.  ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (సెప్టెంబరు 20) నైనా చేసి తీరాలి.

పురాణ కథ

           దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

          ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

              స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

            కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

            ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే( సెప్టెంబరు.20) మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృ దేవతా స్తుతి

                 శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది.

              పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహా పురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

1.నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!

2.నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

3.నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

4.నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

5.నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

6.నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

7.నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

8.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

9.నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

10.నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

11.నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

12.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

13.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

14.పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

15.పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

16.పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

17.తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

18.సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

19.యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

20.యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

21.కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

22.దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

23.పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

24.తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

25.యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

26.రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

27.అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

28.అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

29.ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

30.సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

31.కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

32.వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

33.మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

34.సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

35.ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

రుచిరువాచ
1.అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

2.ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

3.మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

4.నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!

5.ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

6.నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

7.సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

8.అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

9.యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

10.తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

         ........పితృ తర్పణమ్ విధానం తదుపరి పోష్టులో చూడగలరు.........
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment