Sunday, 1 May 2022

కొలను భారతి -సరస్వతి దేవి దేవాలయం

           సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.🌺

కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !! 


🌻ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే బాసర వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు బాసర తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. ఎంతైనా రాష్ట్రాలు విడిపోయాయి కదా !! అంతదూరం వెళ్ళాలా అని కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వారికి 'ఆంధ్ర బాసర' గా వెలుగొందుతున్నది కొలను భారతి.

🌻ఇది ఆంధ్ర ప్రదేశ్ లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

క్షేత్ర విశేషాలు
🌻కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది.

🌻ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నది. ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. పరిసర ప్రాంతలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది.

నల్లమలలో
🌻రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు శిథిలావస్తలో మనకు దర్శనమిస్తాయి. దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.

ఆనవాయితి
🌻రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితి.

🌻 నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.

వరుణ తీర్ధము
🌻ఇచ్చట,"శ్రీ చక్ర సంచారిణీ" యంత్రములో ' కొలను భారతి' ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి"గా కనపడుతుంది.

ఏడు శివాలయాలు
🌻కొలను భారతి ప్రధాన దేవాలయం చేరువలో ఏడు శివాలయాలు ఉన్నాయి. అంతేనా ఇక్కడ జనార్థన స్వామి దేవాలయము కూడా తప్పక దర్శించాలి. ఏడు శివాలయాలూ ఎర్రటి ఇసుక రాయితో నిర్మించి ఉండటం గమనించవచ్చు.

చాళుక్యుల కాలం
🌻వాటిని చూస్తే ... ఇవి చాళుక్యుల కాలం నాటి ఆలయాలు అని అనుకుంటాం కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆ శివాలయాలు శిధిలావస్థ లో ఉంటే .. ఇటీవలే వాటిని పునరుద్ధరించారు. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ప్రతిష్టించారు.

పండుగలు
🌻కొలను భారతి లో ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుగుతాయి. స్థానికంగా ఉండే ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాలవారు ఆ సమయాలలో ఎడ్ల బండీలు కట్టుకొని వచ్చి చూసి వెళుతుంటారు. కార్తీక మాసం, నవరాతి ఉత్సవాలు, మహా శివరాత్రి ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు.

కొలను భారతి దేవాలయం ఎలా చేరుకోవాలి ?
🌻కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లె మండల కేంద్రం నుండి శివపురము అనే గ్రామనికి ముందుగా భక్తులు చేరుకోవాలి. ఇది తారు రోడ్డు. గ్రామానికి చేరుకున్నాక, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డులో ప్రయాణించి కొలనుభారతి దేవాలయం చేరుకోవచ్చు.

మీ
వేద, శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి
 

No comments:

Post a Comment