Saturday, 11 March 2017

శ్రీ లక్ష్మీ జయంతి" మరీయు హోలీ-వసంతోత్సవము

శ్రీ లక్ష్మీ జయంతి" మరీయు హోలీ-వసంతోత్సవము


పాల్గుణం మాసం,శుక్లపక్ష పౌర్ణమి ఉత్తరపాల్గుణీ, ఆది వారము( 12.03.2017)

 శుభదినం "శ్రీ లక్ష్మీ జయంతి". 

                 లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 
3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 
4. తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7. వైవస్వత మన్వంతరంలో కీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. 

                ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో -

               భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను. 
ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. 

                ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. 

              ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన. 

                 ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో -
పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై -

             'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించెను. శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యముకాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

        క్షీరసాగరమధనం :- 

              ఈ పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు".

క్షీరసాగర మధనం జరిగినప్పుడు - 
                 ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం "శివరాత్రి" అయింది. 

               దియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది

        ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో 'సురభి' అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు

            . అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణశుద్ధపూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే ''లక్ష్మీజయంతి"గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం

ప్రాదుర్భవమే కాదు పరిణయం కూడా !

           ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగినదినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే! 

సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు 
నాదుడయ్యేనేసి నడప నోపు 
నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు 
బుష్పదామకమున బూజ సేసె !

       వక్షో నివాస మకరోత్ పరమం విభూతే / యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్' ... లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. 

          లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి - ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!

          శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి. 

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం 
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ 
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం 
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ 

అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటూ 

అలాగే ఈ రోజు మరొక విశేష0 అనగా హోలి పండుగ – వసంతోత్సవం

                 ప్రతి   ఒక్కరూ ఆనందోత్సాహాల తో జరుపుకునే హోలీ పండుగ వచ్చేసిం ది. ప్రతి సంవత్సరం పాల్గుణ మాసం పూర్ణిమ తిథి నాడు అత్యంత ఆనందోత్సవాలతో హోలీ పర్వదినాన్ని ఘనం గా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత రుతువు ఆగమనాన్ని తెలియజే స్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు హోలిక అనే రాక్షసిని చంపడంతో ప్రజలు ఈ పండుగ జరుపుకుంటున్నారన్నది ప్రతీతిలో ఉంది. దీన్నే కాముని పున్నమి, డోలికోత్సవం, పాల్గుణోత్స వం వంటి వివిధ నామాలతో వ్యవహరిస్తుంది

             కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. మన్మధునికి మరో పేరే మదనుడు. అందుకే ఇది మదనోత్సవం, మధూత్సవం అన్న పేర్లతో కూడా పిలువబడుతోంది.
కాముని పున్నమి.. కామదహనం. వసంతోత్సవం. ఫల్గుణోత్సవం. డోలికోత్సవం.. హోలికాపౌర్ణమి. మదనోత్సవం. మధూత్సవం.. ఇలా ఎన్ని పేర్లున్నా చివరికి అందరి నోళ్లలోనూ నానే పేరు మాత్రం ‘హోలి’. ఫాల్గుణమాసంలో ‘శుక్ల పూర్ణిమ’ నే హోలి పండుగగా జరుపుకుంటాం.

              దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈరోజే బ్రహ్మసావర్ణి మన్వాది కూడా. అంటే బ్రహ్మ సావర్ణి దేవీ ఉపాసనతో మనువుగా వరం పొందిన గొప్ప రోజు.
కామదహనం వసంతోత్సవం ఒకానొక సమయములో కైలాసములో శివుడు, సతీ దేవీ ఉండగా దేవతలందరు కలిసి అటుగా ప్రయాణము అవుతున్న దృశ్యం వారికి కనిపించింది.

             వీరంతా ఎక్కడకు వెళుతున్నారని వాకబు చేయగా వారంతా దక్షయజ్ఞానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. సతీ దేవీ ఆశ్చర్యపడి, తన తండ్రి గారు ఆ విషయం తమకు ఎందుకు తెలుపలేదా అని అనుకున్న సమయంలో, పరమ శివుడు దక్షుడు తమను కించపరుస్తున్నాడని, తమను ఆహ్వానించలేదని చెపుతాడు, అయినా సతీ దేవీ అక్కడకు వెళ్లి అవమానం భరించలేక ఆత్మాహుతీ అవ్వటం మనకు తెలిసిన విషయమే.

            అంతేకాక శివుడు సతీ దేవీ ఆత్మాహుతి వార్త విని రుద్రుడై, కాలభైరవుణ్ణి సృష్టించటం, అతడు యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యటం జరిగింది. ఆ తరువాత శివుడు సతీదేవీ వియోగంతో కృంగి ఘోరతపస్సులోకి వెళ్ళటం జరిగింది. శివ జాడలేదని గ్రహించిన రాక్షసులకు ఒక పండుగగా మారి వారు చేసే దుశ్చర్యలకు ఎదురులేకపోయింది.

           దేవతలకు విషమ పరిస్థితులు ఎదురయ్యాయి, వారికి ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో అందరు ఆలోచించి, విరాగి అయిన శివుణ్ణి తపస్సు నుంచీ తప్పించి, వారి దృష్టిని మరల్చాలని ఆశించి, దానికి ఒక్క మన్మదుడే దిక్కని తోచి మన్మధుడిని ప్రేరేపించి, శివుడి మీద మన్మధబాణాలేసి వారి దృష్టిని మార్చాలని కోరారు. దేవతలంతా ఆ విధంగా కోరగా, మన్మధుడు ఇక వారి మాట వినక తప్పలేదు. అదే తడవుగా మన్మధుడు శివునిపైకి బాణాలు వెయ్యటం జరిగింది.  
            తీవ్ర తపస్సులో వున్నా శివుడి తపస్సుకి భంగం కలిగింది. అతిరుద్రుడై కళ్ళు తెరచి చూశాడు, మన్మధుడు వరుసగా బాణాలు విసురుతున్నాడు. శువుడికి విపరీతమైన కోపం కలిగింది, క్షణాల్లో ఏం జరిగిందో ఉహించేలోగా శివుడి కోపాగ్నికి మన్మధుడు బూడిదవ్వడం జరిగిపోయింది. అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది.

              ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధ దహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన ఈ కామదహనం అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది.

            ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కామదహనం ఓ పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కామదహనం జరిగిన తరువాత మన్మధుని భార్య అయిన రాతీదేవీ వచ్చి విషయం తెలుసుకొని తన భర్త భాస్మంగా మారడం చూచి దిగ్భ్రాంతి చెంది తన భర్త కోసం శోకించటం మొదలుపెట్టింది. దేవతలందరినీ పిలిచి మీరేనా నా భర్తను శివునిపైకి పంపారు. ఇప్పుడు ఇలా అయ్యింది. అంటూ భాధపడింది. దేవతలందరూ రతీదేవిని తీసుకొని శివుని దగ్గర చేరి ప్రార్ధించి తిరిగి మన్మధుని బతికించారు.

           మన్మధునికి శరీరం లేకపోయినా ఆయన చెయ్యవలసిన బాధ్యతలు అంటే దేవతలలు మానవులకు కోరికలు ప్రేరేపించడం జరుగుతుందని భార్య రాతీదేవికి మాత్రం శరీరంతోనీ కనిపిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. అలా కాముడైన మన్మధుడు తిరిగి బ్రతికినందుకు వసంతోత్సవం ఆనందంతో చేసుకున్నారని అదే హోలీ అనీ, అదే వసంతోత్సవం అని అంటాము. ఆనాడు రతీమన్మధులను పూజిస్తే కుటుంబానికి సౌభాగ్యం ఆనందం కలుగుతుందని నమ్మకం.

మరొక కథ

           హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది. కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి.

          అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు.

             పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

ఈ హోలికి సంబంధించిన మరొక ప్రస్తావన

శ్లో   :     సరోడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం
            ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్యపురం ప్రజేత్. ||

              పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు ఈ రోజే ఉయలలలో ప్రవేశించాడని ఈ ఫాల్గుణ పూర్ణిమనాడు ఉయలలోని కృష్ణుని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
హోళీ అనే పదం డోల అనే పదానికి ప్రతీకమని అలా హోలి పండుగగా ప్రసిద్దమైనదనీ మరి కొందరు అంటారు. ఏదేమైనా కామదహనం తరువాత జరిగే ఈ హోళీ వసంతోత్సవం ఇంత ప్రాచుర్యాన్ని సంతరించుకొని జాతి సమక్యైతను దారి తీసే విధంగా అందరిని ఆనందిమ్పచేస్తోంది. కాబట్టి తప్పక ఆచరింప తగిన పండుగ, ఇది జాతి, మత, స్త్రీ, పురుషుల వయో భేదం లకుండా కలిసిపోయి ఆనందంగా జరుపుకునే పర్వదినం.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

1 comment:

  1. Chala baga chepparu holi pratyekata gurinchi ala andariki teliyani vishyalu pedutunna meeku dhanyavadamulu

    ReplyDelete